Onion Smuggling | ముంబై (నమస్తే తెలంగాణ) : చెన్నై, ముంబై, బీహార్ నుంచి బంగ్లాదేశ్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలకు ఉల్లిగడ్డల స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. భారత్లో మినహా ఇతర దేశాల్లో కిలో ఉల్లిగడ్డ వెయ్యి రూపాయలు పైనే ఉండటంతో స్మగ్లర్లు అక్రమ రవాణాకు తెగించారు. రోజూ ఉల్లిని అక్రమంగా తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
క్వింటాలుకు రూ.వెయ్యి చొప్పున ఉల్లిని కొనుగోలు చేసి.. విదేశాలకు రూ.9-10 వేల వరకు విక్రయిస్తున్నారు. దేశం నుంచి రోజూ 10-12 కంటైనర్లలో 300 టన్నుల ఉల్లి అక్రమ రవాణా అవుతున్నది. ఈ రాకెట్లో కొందరు కస్టమ్స్ అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నది. ఉల్లిగడ్డల ఎగుమతుల లావాదేవీలన్నీ హవాలా మార్గంలో జరుగుతున్నట్లు సమాచారం. నాసిక్లోని మాలేగావ్, ముంగ్సే, లాసల్ గావ్, పింపాల్ గావ్ల నుంచి ఈ రాకెట్ను నడుపుతున్నారు.