న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్కు సంబంధించిన పోస్టల్ స్టాంపును కేంద్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రారంభమై సంవత్సరం పూర్తయినందున ఈ రోజు మనకు ముఖ్యమైన రోజన్నారు. భారత్లో కొవిడ్ టీకాల పంపిణీని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుందన్నారు.
ఇప్పటికీ 156కోట్లకుపైగా డోసులు వేసినట్లు తెలిపారు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారిలో 93శాతం మంది మొదటి డోస్, 70శాతం మంది వ్యక్తులు రెండు డోసుల టీకా తీసుకున్నారన్నారు. కరోనా వ్యాక్సిన్ రాక ముందే కొంత మంది గందరగోళం సృష్టించారని.. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు, కంపెనీలను ప్రోత్సహించారన్నారు.
ఆ ఫలితంగానే భారత్లో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ నడుస్తోందన్నారు. ఈ సందర్భంగా పోస్టల్ స్టాంప్ను విడుదల చేసి, ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వయం సమృద్ధి భారత్’ కలను సాకారం చేసేందుకు ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ కలిసి స్వదేశీ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేశాయన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు.