శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్లోని (Srinagar) బిషెంబర్ నగర్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జవాన్లు జరిపిన కాల్పుల్లో ముష్కరుడు హతమయ్యాడని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.
అతడు ఈ నెల 4న నగరంలోని మైసుమా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన దాడిలో పాల్గొన్నాడని తెలిపారు. కాగా, ఉద్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని వెల్లడించారు. వారిని ఆర్మీ దవాఖానకు తరలించామన్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.