శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుప్వారాలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఆదివారం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ నిర్వహించింది. లోలాబ్ ప్రాంతంలో షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సెర్చ్ ఆపరేషన్ సమయంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందంపై అదే ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులు దాడి చేసినట్లు పేర్కొన్నారు. బలగాల కాల్పుల్లో పాక్కు చెందిన ఉగ్రవాది హతమయ్యాడని పేర్కొన్నారు. అతనికి లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని కశ్మీర్ ఐజీపీ తెలిపారు. ఇదిలా ఉండగా.. సంఘటనా స్థలంలోనే మరో ఇద్దరు నుంచి ముగ్గురు దాక్కొని ఉన్నట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుండగా.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.