శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. అవంతీపొరాలో (Awantipora) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు. జిల్లాలోని త్రాల్లో ఉగ్రవాదులు నక్కిఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. అతడు ఏ గ్రూప్నకు సంబంధించినవాడనే విషయం గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.
కాగా, పౌరులు, భద్రతా బలగాలపై దాడులకుపాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ దిలాబ్ సింగ్ హెచ్చరించారు. పొరుగు దేశంలో ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. కశ్మీర్ లోయలో శాంతి నెలకొనడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, దానికి భంగం కలిగించడానికి దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని, బాధ్యులపై కఠిన చ్యలు తీసుకుంటామన్నారు.