Lucknow | యూపీ ఎన్నికల సందర్భంగా కమలం అల్లకల్లోలమైపోతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో వికసించాల్సిన కమలం పార్టీ… ఏ రేకు కా రేకు విడిపోతుండటంతో అధిష్ఠానంలో కలవరం ప్రారంభమైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలోచించుకునే లోపలే.. ఒక్కో నేత బీజేపీకి రాం రాం చెప్పేస్తున్నారు. దీంతో యూపీ బీజేపీలో ముసలం పుట్టింది. ఒక్క మంగళవారం రోజునే ఓ కీలక మంత్రితో సహా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్బై చెప్పేశారు. దీంతో యూపీ రాజకీయాలు ఒక్కసారిగా కీలక మలుపు తీసుకున్నాయి. కార్మిక మంత్రిగా బాధ్యతల్లో ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేసి, బీజేపీకి గుడ్ బై చెప్పేసిన కాసేపటికే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేశారు. అందులో రోషన్ లాల్ వర్మ, బ్రిజేశ్ ప్రజాపతి, భగవతి సాగర్ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మంత్రి స్వామి మౌర్యకు మద్దతుగానే రాజీనామాలు చేసి, బీజేపీకి ఝలక్ ఇచ్చారు.
సీఎం యోగి ఏకపక్ష వైఖరి యూపీ బీజేపీలోని మరో వర్గానికి ఏమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. కొన్ని రోజులుగా సీఎం యోగిపై యూపీ బీజేపీలోని ఓ వర్గం విపరీతమైన అసంతృప్తితో ఉందన్న ప్రచారమూ జరిగింది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేట్టు సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కీలక నేతలు చాలా అసంతృప్తితోనే ఉన్నారని, దీని ప్రభావం కచ్చితంగా పార్టీపై పడుతుందని వ్యాఖ్యానించారు. అలాగే యోగికి బీజేపీ అధిష్ఠానం టిక్కెట్ ఇస్తుందో? లేదో? అని కూడా వ్యాఖ్యానించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, యూపీ సీఎం యోగి ప్రచారంలో దూసుకుపోయారు. ఎన్నికల షెడ్యూల్ రాక మునుపే ఈ త్రయం యూపీ ఎన్నికల్లో కాక పుట్టించారు. సమాజ్వాదీ పార్టీపై తీవ్రంగా దుమ్మెత్తి పోశారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా యాక్టివ్ అయిపోయారు. బస్సు యాత్రల ద్వారా బీజేపీపై, యోగి సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలు చేస్తూనే సోషల్ ఇంజినీరింగ్కు పదును పెట్టారు.
ముఖ్యంగా దళితులు, బ్రాహ్మణ వర్గం నేతలపై దృష్టి సారించారు. యోగి సొంత నియోజకవర్గమైన గోరఖ్పూర్కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు, బీఎస్పీకి చెందిన బ్రాహ్మణ సామాజిక వర్గ ఎమ్మెల్యే ఒకరు సమాజ్వాదీలో చేరిపోయారు. ఇక బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే తండ్రి, మాజీ ఎంపీ రాకేశ్ పాండే, మరో మాజీ ఎమ్మెల్యే బ్రిజేశ్ మిశ్రా కూడా సమాజ్వాదీలో చేరిపోయారు. ఇక అత్యంత శక్తిమంతమైన ఎమ్మెల్యే పండిత్ హరిశంకర్ తివారీ, ఆయన కుమారులు కూడా సమాజ్వాదీలో చేరిపోయారు. ఇలా సోషల్ ఇంజినీరింగ్ చేస్తూ బీజేపీకి ఝలక్ ఇస్తున్నారు అఖిలేశ్.
కేవలం యూపీలోనే కాదు.. గోవా బీజేపీలోనూ ఇదే ముసలం పుట్టింది. క్రైస్తవ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అయినా తమకు వచ్చే నష్టమేమీ లేదని ముఖ్యమంత్రి సావంత్ బీరాలు పలుకుతున్నారు. మొదటగా మంత్రి మైఖేల్ లోబో తన మంత్రి పదవికి రాజీనామా చేసేసి, బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత కర్టోలిం ఎమ్మెల్యే అలినా సల్తానా కూడా బీజేపీని వీడారు. ఇక మరో ఎమ్మెల్యే రోడ్రిగ్స్, విల్ఫ్రెడ్ డిసౌజా కూడా బీజేపీకి గుడ్బై చెప్పేశారు.