శ్రీనగర్, ఆగస్టు 16: ‘లోయ నుంచి మమ్మల్ని తరలించండి’ అని దీనంగా వేడుకున్నారు. నిద్రాహారాలు మాని దీక్షలు చేపట్టారు. రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేశారు. అయినా కేంద్రప్రభుత్వం కశ్మీరీ పండిట్ల అభ్యర్థనను పట్టించుకున్న పాపాన పోలేదు. మోదీ సర్కారు, స్థానిక అధికార యంత్రాంగం అలక్ష్యమే ఇప్పుడు మరో పండిట్ను పొట్టనబెట్టుకున్నది. మంగళవారం ఉగ్రవాదుల కాల్పుల్లో కశ్మీరీ పండిట్ సునీల్కుమార్ (45) మరణించగా, ఆయన సోదరుడు పింటూ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. షోపియాన్ జిల్లా చోటిపోరా ప్రాంతంలోని ఓ యాపిల్ తోటలో ఈ ఘటన జరిగింది. ‘యాపిల్ తోటలో పౌరులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో మైనారిటీ కమ్యూనిటీకి చెందిన పండిట్ సునీల్ కుమార్ చనిపోగా, ఆయన సోదరుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సమీప దవాఖానకు తరలించాం’ అని పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు. గడిచిన వారంలో లోయలో ఉగ్రవాదులు దాడులను తీవ్రం చేశారు. ఉగ్రదాడుల్లో ఒక్క ఈ ఏడాదిలోనే 15 మంది పౌరులు, ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించారు.
ముందే అభ్యర్థించినా.. పట్టించుకోలేదు
పండిట్లపై ఉగ్రదాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి కీలక ప్రకటన చేసింది. పండిట్లు వెంటనే లోయను విడిచిపెట్టి వెళ్లాలని పేర్కొంది. ‘లోయలోని పండిట్లు అందరినీ చంపుతామని ఉగ్రవాదులు తాజా ఘటనతో చెప్పకనే చెప్పారు. పండిట్లు వెంటనే లోయను విడిచిపెట్టాలి. ఢిల్లీ లేదా జమ్ము వంటి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి’ అని కేపీఎస్ఎస్ చీఫ్ సంజయ్ టిక్కూ అన్నారు. ‘32 ఏండ్లుగా ఈ హత్యాకాండ కొనసాగుతూనే ఉన్నది. పండిట్ల రక్షణలో ప్రభుత్వం విఫలమయ్యింది’ అని మండిపడ్డారు. తమపై దాడులు జరుగుతాయని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బాధితులు ముందుగానే ఉన్నతాధికారులను సంప్రదించారని, అయితే, అధికారులు వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ, షా సమాధానం చెప్పాలి
పండిట్ హత్య ఘటనను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. లోయలో పండిట్లకు భద్రత కల్పించడంలో కేంద్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విరుచుకుపడ్డారు. ‘జమ్ముకశ్మీర్లో బీజేపీ ఎల్జీని నియమించింది. అక్కడి ప్రభుత్వం కేంద్రం నేతృత్వంలోనే కొనసాగుతున్నది. అయినప్పటికీ పండిట్లపై దాడులు ఆగడంలేదు. దీన్ని చూస్తే, మైనారిటీల భద్రత విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైనట్టు అర్థమవుతున్నది. ఆర్టికల్ 370 రద్దుతో కొత్తగా ఒరిగిందేమీలేదు’ అన్నారు. తాజా హత్యకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పండిట్ హత్య ఘటనను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఉగ్రదాడిలో పండిట్ మరణం తనను కలిచివేసిందని సిన్హా తెలుపగా.. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని అబ్దుల్లా పేర్కొన్నారు. లోయ నుంచి తరలించాలని గత కొన్నిరోజులుగా పండిట్లు డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.