కోల్కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల కోసం పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పోరాటాన్ని మరింత తీవ్రం చేయనున్నది. దీని కోసం కోటి లేఖల ప్రచారాన్ని (One Crore Letter Campaign) ప్రకటించింది. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ శనివారం అలీపుర్దువార్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం కింద బెంగాల్కు రావాల్సిన నిధుల విడుదల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పారు. దీని కోసం కోటి సంతకాల సేకరణ చేపడతామని తెలిపారు. బకాయి లబ్ధిదారులతో కలిసి ఆ లేఖలను ప్రధాని మోదీతోపాటు గ్రామీణాభివృద్ధి మంత్రికి స్వయంగా అందజేస్తామని చెప్పారు. ‘మా వాటా నిధులను డిమాండ్ చేస్తూ బెంగాల్ ప్రజల నుంచి కోటి లేఖలు ప్రధాని మోదీకి పంపుతాం. ఈ లేఖలన్నీ ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తాను. కోటి మంది బెంగాల్ ప్రజలు లేఖలతో రాకుండా కేంద్రం అడ్డుకుంటుందేమో చూద్దాం’ అని అన్నారు.
కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల కోల్కతాలో రెండు రోజులపాటు ధర్నాలో కూర్చొని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి బెంగాల్కు రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు బకాయిలను కేంద్రం చెల్లించపోవడంపై ఆమె మండిపడ్డారు. ప్రజల హక్కులు, వారి హక్కు ధనాన్ని బీజేపీ నిలిపివేస్తున్నదని విమర్శించారు.
Also Read: