Pegasus | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశంలో మరోసారి పెగాసస్ కలకలం రేగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పలువురు మేధావులపై పెగాసస్తో గూఢచర్యం నిర్వహిస్తున్నదన్న ఆరోపణలు నిజమేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన సెక్యూరిటీ ల్యాబ్ ప్రకటించింది. వాషింగ్టన్ పోస్ట్ భాగస్వామ్యంతో నిర్వహించిన పరిశోధనలో సంపాదించిన ఆధారాలతో గురువారం ఆ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా ఇద్దరు జర్నలిస్టులపై పెగాసస్ స్పైవేర్తో గుర్తు తెలియని కేంద్ర ప్రభుత్వ సంస్థ గూఢచర్యం నిర్వహించినట్టు ఆరోపించింది. బాధితుల్లో ఒకరు ది వైర్ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్, ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్’కు చెందిన ఆనంద్మంగ్నాలే ఉన్నారు.
వరదరాజన్పై పెగాసస్ స్పైవేర్తో నిఘా పెట్టడం ఇది రెండోసారి. ఆనంద్ మగ్నాలే కొంతకాలంగా ప్రధాని సన్నిహితుడైన గౌతమ్ అదానీ వ్యాపార లావాదేవీలపై పరిశోధన చేస్తున్నారు. ‘వృత్తి ధర్మం నెరవేరుస్తున్న జర్నలిస్టులను ఇప్పటికే భారత ప్రభుత్వం కఠిన చట్టాల కింద అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధిస్తున్నది. ఈ అణచివేతకు అదనంగా వారిపై నిఘా కూడా పెడుతున్నట్టు గుర్తించాం’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది.