న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై ఇవాళ కూడా పార్లమెంట్ లో రగడ సాగింది. రాజ్యసభలో ఇవాళ ఆ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మణిపూర్ ఇష్యూపై చర్చించాలని సుమారు 60 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారు. రూల్ 267 కింద చర్చించాలని డిమాండ్ చేశారు. కానీ ఆ నోటీసులను చైర్మెన్(Rajya Sabha Chairman) జగదీప్ ధన్ఖడ్ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు చైర్మెన్ మొగ్గుచూపారు.
అయితే రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ సభకు ప్రధాని వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని చైర్మెన్ను కోరారు. ఆ సమయంలో చైర్మెన్ జగదీప్ మాట్లాడుతూ.. అలాంటి దేశాల్ని చైర్ ఇవ్వలేదన్నారు. తాను ఆదేశాలు ఇవ్వడం కుదరదని, అది తాను చేయలేనని చెప్పారు. అయితే నోటీసుల్ని చైర్మెన్ తిరస్కరించడంతో.. విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. రూల్ 267 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని 58 నోటీసులు తనకు అందినట్లు ధన్ఖర్ తెలిపారు. ఆ నోటీసుల్ని ఆమోదించడం లేదన్నారు.