న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాలిక్ మాలిక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఒక అహంకారి అని వ్యాఖ్యానించారు. అంతేగాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రధానికి మతిపోయిందని వ్యాఖ్యానించినట్లు ఆరోపించారు. సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంటున్నది. మీ బీజేపీ గవర్నరే మిమ్మల్ని అహంకారి అంటున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నది.
మేఘాలయ గవర్నర్ సత్యపాలిక్ ఆదివారం (నిన్న) హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ‘ఇటీవల రైతుల సమస్యలపై మాట్లాడేందుకు నేను ప్రధానిని కలిశాను. ఈ సందర్భంగా కేవలం ఐదు నిమిషాల్లోనే ప్రధానిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చాలా అహంకారం ప్రదర్శించారు. మన రైతులు దాదాపు 500 మంది చనిపోయారు అని నేను ప్రస్తావిస్తుండగానే.. ‘వాళ్లు నాకోసం చనిపోయారా..?’ అంటూ ప్రధాని స్వరం పెంచారు’ అని చెప్పారు.
ప్రధాని ప్రశ్నకు తాను అవును అని సమాధానం చెప్పానని మాలిక్ పేర్కొన్నారు. మీరు రాజు కాబట్టి రైతుల మరణాలకు మీరే బాధ్యులని చెప్పానని తెలిపారు. తర్వాత ప్రధాని తనకు హోంమంత్రి అమిత్షాను కలిసి మాట్లాడమని చెప్పారని, ఆయన చెప్పినట్లే తాను అమిత్ షాను కలిశానని అన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రధానిని ఉద్దేశించి ‘సత్యా ఆయనకు మతి తప్పింది’ అని వ్యాఖ్యానించినట్లు ఆరోపించారు. కుక్క చచ్చినా సంతాప లేఖ పంపే ప్రధాని రైతుల మరణాలపై స్పందించలేదని విమర్శించారు. ఇక ప్రధానితో పోరాటానికి స్వస్తి పలుకుతున్నానని అన్నారు.
కాగా, సత్యపాల్ మాలిక్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ బాగానే క్యాష్ చేసుకుంటున్నది. ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియోను అధికారిక ట్విట్టర్లో పోస్టుచేసింది. మోదీజీ ఇది నిజమేనా అని ఆ పోస్టుకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కూడా ప్రధానిపై అమిత్ షా వ్యాఖ్యల గురించి సత్యపాల్ మాలిక్ చెప్పిన వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. రాజ్యంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ల మధ్య ఇలాంటి చర్చ జరుగొచ్చా అని ఆ పోస్టులో పేర్కొన్నారు.