లక్నో : కరోనా టీకాకు భయపడి ఓ 80 ఏండ్ల బామ్మ తన ఇంట్లో దాక్కున్నది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఎథావా జిల్లాలోని చందన్పూర్ గ్రామంలో వెలుగు చూసింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సరిత బదౌరియాతో పాటు ఆరోగ్య శాఖ అధికారులు కరోనా వ్యాక్సిన్పై అవగాహన కల్పించి, టీకా ఇచ్చేందుకు చందన్పూర్ గ్రామానికి మంగళవారం వెళ్లారు. అయితే అందరూ స్వచ్ఛందంగా ఇండ్ల నుంచి టీకా కోసం బయటకు వచ్చారు. కానీ ఓ 80 ఏండ్ల బామ్మ మాత్రం ఇంటి తలుపు వెనుకాల దాక్కుంది. ఆరోగ్య శాఖ అధికారులు దగ్గరికి వెళ్లగా.. అక్కడే ఉన్న పెద్ద డ్రమ్ము వెనుకాలకు జారుకుంది.
దీంతో ఓ మహిళా వైద్యురాలు.. బామ్మ వద్దకు వెళ్లి.. మీ ఎమ్మెల్యే పిలుస్తున్నారు, బయటకు రా అని బతిమాలింది. తన వద్ద ఎలాంటి ఇంజెక్షన్ లేదని తెలిపింది. మొత్తానికి ఆ వృద్ధురాలు బయటకు వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సరిత మాట్లాడుతూ.. కరోనా టీకా పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతూ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అయితే టీకా వేసుకుంటే జ్వరం వస్తుంది అని ఆమెకు ఎవరో చెప్పారని, అందుకే టీకా వేసుకునేందుకు ఆసక్తి చూపలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే ఆ గ్రామంలో అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ ఒక్క బామ్మ మాత్రం వ్యాక్సిన్ తీసుకోలేదని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఆ రాష్ర్ట జనాభాలో 2 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. 23 కోట్ల జనాభాకు 35 లక్షల మంది మాత్రమే టీకా వేయించుకున్నారు.