లక్నో : ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖింపూర్ ఖేరీలో నిన్న నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సోమవారం ఉదయం ప్రియాంక వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు వెళ్తున్నానని ఆమె పేర్కొన్నారు. తాము ఎలాంటి నేరం చేయలేదు.. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తనకు లీగల్ ఆర్డర్ ఇచ్చి అడ్డుకోవాలన్నారు. ఒక వేళ తనను బలవంతంగా పోలీసు కారులో ఎక్కిస్తే.. మీపై కిడ్నాప్ కేసు పెడుతానని హెచ్చరించారు. ఇది రైతుల దేశం.. బీజేపీది కాదు. రైతులకు జీవించే హక్కు లేదా? రాజకీయాలతో రైతులను అణచివేస్తారా? అని ప్రశ్నించారు. గత కొన్ని నెలలుగా రైతులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. రైతుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రియాంక గాంధీ కోపోద్రిక్తులయ్యారు.