న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో సర్వత్రా బూస్టర్ డోస్పై చర్చ జరుగుతున్నది. టీకా మూడో డోస్ మహమ్మారి నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో బూస్టర్ డోస్ తీసుకున్న ముగ్గురు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ముగ్గురు లోక్నాయక్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. గత శుక్రవారం నమోదైన కేసుల్లో మూడో టీకా తీసుకున్న ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్ గుర్తించారు.
అయితే, వీరిలో ఎవరి లక్షణాలు లేవని ఆసుపత్రికి చెందిన సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు. ప్రస్తుతం దేశంలో బూస్టర్ డోస్ అందుబాటులో లేదని, ముగ్గురు విదేశీ పర్యటన కోసం వెళ్లిన సమయంలో అక్కడ బూస్టర్ డోస్ తీసుకున్నారన్నారు. ఆ తర్వాత ఢిల్లీకి చేరుకున్న తర్వాత విమానాశ్రయంలో కొవిడ్ పరీక్షలు కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఏ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నారనే విషయంపై స్పష్టత రాలేదు.
లోక్ నాయక్ ఆసుపత్రి వివరాల ప్రకారం.. కరోనా సోకిన 50 మంది రోగులు ఇప్పటి వరకు ఆసుపత్రిలో చేరారు. ఇందులో 22 మందికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. పది మంది రోగులు డిశ్చార్జవగా.. 12 మంది చికిత్స పొందుతున్నారు. ఈ 22 మందిలో 14 మంది చాలా రోజుల కిందటే రెండు డోసుల టీకా తీసుకున్నారు. ముగ్గురు బూస్టర్ డోస్ తీసుకోగా.. మరో ఐదుగురి వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇద్దరిలోనే లక్షణాలు కనిపించాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.