న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు రోజుల్లో నగరంలో నమోదైన కరోనా కేసుల్లో 84శాతం ఒమిక్రాన్ వేరియంట్కు చెందినవేనన్నారు. ఢిల్లీలో ఇవాళ 4వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పాజిటివిటీ రేటు 6.5శాతానికి పెరుగుతుందన్నారు. ప్రస్తుతం 202 మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరానన్నారు.
గతేడాది మే 20 తర్వాత ఢిల్లీలో ఆదివారం భారీగా కొవిడ్ కేసులు పెరిగాయి. ఆరోగ్యశాఖ జారీ చేసిన బులిటెన్ ప్రకారం.. పాజిటివిటీ రేటు 4.59శాతానికి పెరిగింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,700 ఒమిక్రాన్ కేసులు 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి. ఇందులో 639 మంది బాధితులు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 510, ఢిల్లీలో 351, కేరళలో 156, గుజరాత్లో 136, తమిళనాడు 121, రాజస్థాన్ 120 కేసులు నమోదయ్యాయి.