13 వేలు దాటిన కొత్త కేసులు
కొత్త వేరియంట్తో తీవ్రతరం
వెయ్యి దాటిన ఒమిక్రాన్ కేసులు
వ్యాక్సినేషన్, పరీక్షలు పెంచాలని 8 రాష్ర్టాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: దేశంలో కరోనా కోరలు చాస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 48 గంటల్లోనే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఢిల్లీలో కొత్తగా 1,313 కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోలిస్తే ఇది 42 శాతం ఎక్కువ. అలాగే గడిచిన 7 నెలల్లో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 14,45,102కు చేరింది. ఇప్పటివరకూ 263 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనూ వైరస్ కల్లోలం సృష్టిస్తున్నది. కొత్తగా 5,368 కేసులు రికార్డయ్యాయి. ఇందులో 198 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి, కరోనా కేసుల సంఖ్య 66,65,386కు చేరింది. అటు ముంబైలోనూ కేసుల ఉద్ధృతి కొనసాగుతున్నది. నగరంలో కొత్తగా 3,671 కేసులు నమోదయ్యాయి. దీంతో వచ్చే జనవరి 7 వరకు ముంబైవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
సంసిద్ధంగా ఉండండి
కరోనా కేసులు పెరుగుతున్న 8 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. పరీక్షలు పెంచాలని, దవాఖానలను సిద్ధం చేసుకోవాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్లకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. చలికాలం కావడంతో జలుబు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
వ్యాక్సిన్తో తొమ్మిది నెలలు రక్షణ
కొవిడ్-19 వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 9 నెలలకు పైగా నిరోధకత ఉంటుందని.. ఆ తర్వాతే ముందు జాగ్రత్త డోసు వేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ముందస్తు జాగ్రత్త డోసుగా గతంలో వేసిన వ్యాక్సినే వేయాలా? లేదంటే వేరే వ్యాక్సిన్ వేయాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని, జనవరి 10లోపు మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.
అగ్రరాజ్యంలో వైరస్ కల్లోలం
అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ పంజా విసురుతున్నది. వరుసగా రెండోరోజూ 4 లక్షల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో అంక్షలను కఠినతరం చేశారు. అటు ఐరోపా దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్లో రెండు లక్షల చొప్పున, స్పెయిన్, ఇటలీలో లక్ష చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయి.
పిల్లలపై కొవాగ్జిన్ ప్రభావవంతం
పిల్లలను కొవిడ్ బారి నుంచి కాపాడటంలో తమ కొవాగ్జిన్ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్లో నిర్ధారణ అయిందని భారత్ బయోటెక్ సంస్థ గురువారం ప్రకటించింది. ‘ఈ విషయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉంది. పిల్లలకు, పెద్దలకు టీకా తయారు చేయాలన్న మా లక్ష్యం నెరవేరింది’ అని సంస్థ ఎండీ, చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. భారత్ బయోటెక్ 2-18 ఏండ్ల పిల్లలపై జూన్-సెప్టెంబర్ మధ్యలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ట్రయల్స్ సమాచారాన్ని అక్టోబర్లో సీడీఎస్సీవోకు సమర్పించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకాను పిల్లలకు వేయడానికి డీసీజీఐ ఇటీవలే అనుమతి ఇచ్చింది.