ప్రమాదకరంగా బీఏ-4, బీఏ-5 వేరియంట్లు
టోక్యో యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
రాష్ట్రంలో ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువే
ప్రమాదమేమీ లేదంటున్న వైద్య నిపుణులు
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్ సహా అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో కేసులపై అధ్యయనం చేసిన జపాన్కు చెందిన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఊపిరితిత్తులపై దాడి చేస్తున్నాయని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసుల్లో బీఏ-2, బీఏ-4, బీఏ-5 ఎక్కువగా ఉంటున్నాయని, అందులో బీఏ-4, బీఏ-5 వేరియంట్లు నేరుగా ఊపిరితిత్తుల కణాలపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఈ సబ్ వేరియంట్ల నిర్మాణం ఆల్ఫా, డెల్టా వేరియంట్లతో పోలి ఉన్నదని తెలిపారు. ఇవి మానవ ఊపిరితిత్తుల కణాల్లోకి చేరిన తర్వాత బీఏ-2 వేరియంట్ కన్నా వేగంగా పునరుత్పత్తి చెంది సంతతిని పెంచుకొంటున్నాయని, దాంతో శ్వాస క్రియపై ప్రభావం పడుతున్నదని వెల్లడించారు.
ప్రమాదం లేదు.. జాగ్రత్త తప్పనిసరి
రాష్ట్రంలో కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మూడు వారాల్లోనే కేసుల సంఖ్య ఏడు రెట్లు పెరిగింది. అయితే.. మన దేశంలో, రాష్ట్రంలో ఇప్పటికీ బీఏ-2 వేరియంట్దే ఆధిపత్యం. మొత్తం నమోదవుతున్న కేసుల్లో 65-70 శాతం బీఏ-2 వేరియంట్ కేసులే. బీఏ-4, బీఏ-5 కేసులు 1.5-3 శాతంలోపే నమోదవుతున్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు. రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడినవారందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది. మరోవైపు మూడు వేవ్లతో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. కొవిడ్ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
కొత్తగా 493 మందికి కరోనా
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 493 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు 1.70 శాతంగా నమోదైంది. గురువారంతో పోల్చితే హైదరాబాద్ జిల్లాలో 50 కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రికవరీ రేటు క్రమంగా తగ్గుతున్నది. శుక్రవారం 99.07 శాతంగా నమోదైంది. మరోవైపు 219 మంది కొవిడ్ నుంచి కోలుకొన్నారు. శుక్రవారం అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 366 కేసులు, రంగారెడ్డిలో 40, మేడ్చల్ మల్కాజిగిరిలో 34 కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం వంటి కొవిడ్ జాగ్రత్తలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో ఓవైపు కరోనా కేసులు, మరోవైపు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కచ్చితంగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి. రాష్ట్రంలో ఇప్పటికీ 65 శాతానికి పైగా బీఏ-2 వేరియంట్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్నా, ప్రమాదం లేదు కాబట్టి ఆందోళన అవసరం లేదు. రాబోయే 7, 8 నెలల్లో కరోనా పూర్తిగా తగ్గిపోతుంది.
– డీపీహెచ్ శ్రీనివాసరావు
పిల్లలకు ఇబ్బంది లేదు
మొదటి నుంచీ కరోనాతో పిల్లలకు ఇబ్బంది లేదు. కొవిడ్ పాజిటివ్ వచ్చినా జలుబు, దగ్గు వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. కేసులు పెరుగుతున్నందున స్కూల్కు వెళ్లే పిల్లలు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.
– డాక్టర్ అనుపమ, పీడియాట్రీషియన్, రెయిన్బో హాస్పిటల్