శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా విషయంలో తమ సహనాన్ని పరీక్షించవద్దని సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్ర హోదా డిమాండ్పై జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని అన్నారు. (Omar Abdullah) ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తన అమ్మమ్మ అక్బర్ జహాన్ 26వ వర్ధంతి సందర్భంగా హజ్రత్బాల్లోని తన తాతా-అమ్మమ్మల సమాధుల వద్ద శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఒమర్ అబ్దుల్లా ప్రసంగించారు. అమ్మమ్మ నుంచి తాను నేర్చుకున్న అతిపెద్ద పాఠం ‘సహనం’ అని అబ్దుల్లా తెలిపారు. అయితే జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో తన సహనాన్ని బలహీనతగా భావించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాగా, రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ‘సరైన సమయం’ అంటే ఏమిటో కేంద్రం స్పష్టం చేయాలని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. లడఖ్ ప్రతినిధులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్న కేంద్రం, జమ్ముకశ్మీర్ ప్రజలతో ఎందుకు చర్చలు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర హోదా డిమాండ్ కోసం జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఆ రోజున జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను కోరారు. కేంద్రం చర్చలకు సిద్ధంగా ఉన్నదా? లేదా? అనే దానిపైనే ఈ ఉద్యమ తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.