న్యూఢిల్లీ: ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలకు బలం చేకూర్చేలా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం క్రూడాయిల్పై పడుతున్నది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయి. అయితే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏం చెయ్యాలన్నదానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది’ అని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పొరుగు నగరాల్లో సీఎన్జీ ధర పెరిగింది. కేజీ సీఎన్జీపై 50 పైసల నుంచి రూ.1 వరకు పెంచినట్టు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ పేర్కొన్నది. ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర రూ.57.01 నుంచి 57.51కు పెరగ్గా, నోయిడా, ఘాజియాబాద్ల్లో ఒక రూపాయి పెరుగుదలతో రూ.59.58కి చేరింది.