న్యూఢిల్లీ, అక్టోబర్ 18: రోడ్డు నిర్మాణ లోపాల వల్లే ప్రమాదం జరిగినట్టు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తెలిపింది. ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీ చేయడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపింది. కాంట్రాక్ట్ ఒప్పందంలోని నిబంధనలు, పాలసీ మార్గదర్శకాలను విస్మరించడం ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేసింది.
రోడ్డు మార్కింగ్, రోడ్డు సంకేతాలు, క్రాష్ బారియర్ల ఎండ్ ట్రీట్మెంట్లాంటి పనులను పంచ్ లిస్ట్లో ఉంచి ప్రొవిజనల్ కంప్లీషన్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారని, ఇది ప్రయాణికుల భద్రతపై రాజీపడడమే అని తెలిపింది. ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీ చేసేముందు ప్రాజెక్ట్ హైవేపై రహదారి భద్రత పనులు అన్ని విధాలా పూర్తయ్యాయని నిర్ధారించుకోవాలని పేర్కొంది. నాసిరకం ఇంజినీరింగ్ పనుల వల్ల ప్రమాదాలు జరిగితే రీజినల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్, సంబంధిత ఇంజినీర్ బాధ్యత వహించాలని తెలిపింది.