Odisha Train Accident | ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం కేసు నమోదు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వం సూచనల మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ నెల 2న ఒడిశాలోని బహనాగా బజార్ రైల్వేస్టేషన్కు సమీపంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్తో పాటు గూడ్స్ రైలు ప్రమాదంపై కేసు నమోదు చేసేందుకు డీవోపీటీ సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత సీబీఐ బృందం బాలాసోర్ చేరుకుంది. ప్రమాదంపై ఈ నెల 3న జీఆర్పీఎస్ కేసు ప్రకారం సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా పది మంది సభ్యుల సీబీఐ బృందం ఒడిశా చేరుకుంది.
గత శుక్రవారం బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ రైలు దుర్ఘటనలో 278 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ రైల్వే బోర్డు ఆదివారం నిర్ణయం తీసుకుంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే సీపీఆర్వో ఆదిత్య కుమార్ చౌదరి మాట్లాడుతూ ఫోరెన్సిక్, సీబీఐ బృందం సంఘటనా స్థలంలో ఉందని, సాక్ష్యాలను సేకరిస్తున్నారన్నారు. రైల్వే సీబీఐ బృందానికి సహాయం అందిస్తుందని తెలిపారు. సీబీఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. ఖరగ్పూర్, బాలాసోర్తో సహా పలు ప్రాంతాల్లో రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) బృందం సైతం పని చేస్తోందని, మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొంది.