భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదానికి (Odisha train tragedy) మతం రంగు పులిమేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ముస్లిం వర్గంపై అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రమాదం జరిగిన రోజు శుక్రవారం అని, ప్రమాద సంఘటన వద్ద కనిపించిన ఒక నిర్మాణం మసీదుగా పేర్కొన్నారు. అయితే డ్రోన్ ద్వారా తీసిన వీడియో ఫుటేజ్, ఫొటోలో కనిపించిన బహానగర్లోని తెల్లని నిర్మాణం ఇస్కాన్ దేవాలయంగా తేలింది.
ఈ నేపథ్యంలో వివాదస్పద సోషల్ మీడియా పోస్టులపై ఒడిశా పోలీసులు స్పందించారు. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయడం ద్వారా మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు, చెడు ప్రేరేపిత పోస్ట్లను సర్క్యులేట్ చేయవద్దని ప్రజలకు సూచించారు. మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదానికి కారణాలపై రైల్వేతోపాటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒడిశా పోలీసులు ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు.
కాగా, ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే ‘ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్’లో సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే బోర్డు ఆపరేషన్స్, బోర్డు సభ్యురాలు జయ వర్మ సిన్హా కూడా ఇదే విషయం చెప్పారు. పూర్తి దర్యాప్తు తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు.
We appeal to all concerned to desist from circulating such false and ill-motivated posts. Severe legal action will be initiated against those who are trying to create communal disharmony by spreading rumours.
— Odisha Police (@odisha_police) June 4, 2023