Odisha Rail Accident : భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మృతులకు ఒడిశా ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా(Ex gratia) ప్రకటించింది. గాయపడ్డవాళ్లకు రూ.2 లక్షలు ఇవ్వనుంది. ఈ ఘటనలో గాయపడిన 300మందిలో 39 మందికి పైగా మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(Naveen Patnaik) కంట్రోల్ రూమ్కు వెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
ప్రాణ భయంతో కొందరు బోగీలో చిక్కుకున్నారని, దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే మరో రైలు కూడా ఇక్కడే ప్రమాదానికి గురైనట్టు ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా వెల్లడించాడు. పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆ పక్కనే వెళ్తున్న యశ్వంతపూర్ – ఐరా ఎక్స్ప్రెస్ను ఢీ కొట్టింది. దాంతో, అందులోని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించేందుకు 50 అంబులెన్స్లు సరిపోకపోవడంతో.. బస్సులను ఏర్పాటు చేశారు.
కోల్కతా నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ బహనాగ స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును ఈరోజు రాత్రి 7ః 10 గంటల సమయంలో ఢీకొట్టింది. దాంతో 7 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో మొదట 179కి గాయపడ్డారని తెలిసింది. అయితే.. క్షతగాత్రుల సంఖ్య 300లకు పెరిగింది. గాయపడ్డ వారిని హుటాహుటీన సోరో, గోపాల్పూర్, ఖంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.