భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Odisha Train accident) చనిపోయిన 82 మంది వ్యక్తుల మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. ఎయిమ్స్ భువనేశ్వర్లో వీటిని భద్రపరిచారు. అయితే ఈ మృతదేహాల గుర్తింపు కోసం పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల సహాయాన్ని ఒడిశా ప్రభుత్వం కోరింది. ఆయా రాష్ట్రాల అధికారులతో గురువారం చర్చలు జరిపింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద మృతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి బాధిత కుటుంబాలకు అందజేసేందుకు సహకరించాలని పేర్కొంది.
కాగా, రైలు ప్రమాద మృతులను గుర్తించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కమిషనర్ విజయ్ అమృత కులంగే తెలిపారు. అలాగే మృతదేహాలను గుర్తించేందుకు వచ్చే బాధిత కుటుంబాలకు ఆహారం, వసతి వంటి ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు. ఎయిమ్స్ భువనేశ్వర్లో ఉంచిన 162లో 80 మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇంకా 82 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. మృతదేహాలు తమ వారివేనంటూ ఎక్కువ మంది చెబుతున్నారని, దీంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి వాటిని అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఇప్పటి వరకు 50 డీఎన్ఏ నమూనాలు సేకరించి పరీక్ష కోసం ఎయిమ్స్ ఢిల్లీకి పంపినట్లు అధికారులు తెలిపారు. తొలుత పంపిన 29 డీఎన్ఏ నమూనాల రిపోర్టులు మరో రెండు రోజుల్లో వస్తాయని చెప్పారు. అప్పుడు మృతదేహాలను సరైన కుటుంబాలకు అప్పగిస్తామని అన్నారు. అలాగే మృతదేహాలు పాడవకుండా మైనస్ 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న కంటైనర్లో ఉంచినట్లు వెల్లడించారు.
అయితే మృతదేహాలు తారుమారవుతున్నట్లు కొందరు ఆరోపించారు. రైలు ప్రమాదంలో మరణించిన తన కుమారుడి మృతదేహాన్ని బీహార్ కుటుంబానికి అప్పగించారని బెంగాల్కు చెందిన వ్యక్తి తెలిపాడు. డీఎన్ఏ పరీక్ష రిపోర్ట్ రాకముందే తన కుమారుడిగా భావించిన మృతదేహాన్ని వేరే వారికి అప్పగించారని ఆరోపించాడు. సరిగ్గా వారం కిందట ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 288 మంది మరణించగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. వందలాది మంది కాళ్లు, చేతులు కోల్పోయి వికలాంగులయ్యారు.