భువనేశ్వర్, డిసెంబర్ 28: ఒడిశాలోని ఓ హోటల్లో ఇద్దరు రష్యన్లు మృతిచెందిన ఘటనలపై రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాయగడలోని హోటల్లో రెండురోజుల వ్యవధిలో ఈ మరణాలు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు బుధవారం దర్యాప్తును ప్రారంభించారు. తోటి ప్రయాణికులు, టూర్ గైడ్ను విచారణ చేస్తున్నట్టు వారు వెల్లడించారు. రష్యా ఎంపీ, వ్యాపారవేత్త పావెల్ ఆంటోవ్(65) ఈనెల 24న హోటల్ మూడో ఫ్లోర్ నుంచి కిందపడి మరణించారు.
అంతకుముందు 22న అతని సహచర ప్రయాణికుడు వ్లాదిమిర్ బిడెనోవ్ హోటల్లోని తన రూమ్లో అనుమానాస్పద రీతిలో చనిపోయి ఉన్నాడు. కాగా, భవనంపై నుంచి పడటంతో తీవ్ర గాయాలతో ఎంపీ ఆంటోవ్, గుండెపోటు కారణంగా బిడెనోవ్ మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలు పేర్కొన్నాయని పోలీసులు తెలిపారు. రష్యా దౌత్యకార్యాలయం వినతి మేరకు దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు
తెలిపారు.