న్యూఢిల్లీ, నవంబర్ 8: మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లు రెండు వర్గాల మధ్య చిచ్చుకు దారి తీస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న మరాఠాల ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గి వారిని ఓబీసీల్లో చేర్చడానికి యత్నిస్తుండగా, దానిపై ఓబీసీలు మండిపడుతున్నారు. మరాఠాలను కనుక ఓబీసీ కేటగిరీలో చేరిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. మరాఠాలకు కుంబీ కుల సర్టిఫికెట్ జారీ చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే తాము కోర్టులను ఆశ్రయించడమే కాక ఆందోళనలు నిర్వహిస్తామని ఓబీసీలు ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు పలువురు ఓబీసీ నేతలు మంగళవారం మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్బల్ (అజిత్ పవార్ వర్గం)ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవడానికి రాష్ట్రంలోని వివిధ ఓబీసీ గ్రూపుల వారు ఏకతాటిపై నిలిచి రానున్న 20 రోజుల్లో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఒక పక్క మరాఠాలకు రిజర్వేషన్లు వద్దంటూ ఓబీసీలు ఒత్తిడి చేస్తుండగా, డిసెంబర్ 24లోగా మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ జరాంగే బుధవారం హెచ్చరించారు. మరాఠాలకు రిజర్వేషన్ల అంశంపై గతంలో మరాఠా నేతలే సహకరించేవారు కాదని, రిజర్వేషన్లు వద్దంటూ వారే గత 30-40 ఏండ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తెచ్చారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం డిసెంబర్ 24లోగా రిజర్వేషన్లు కల్పించకపోతే రిజర్వేషన్లను అడ్డుకున్న మరాఠా నేతల పేర్లన్నింటినీ బయటపెడతానకి హెచ్చరించారు.