Nupur Sharma | లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు గెలుపు గుర్రాల కోసం జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీ అభ్యర్థులను ప్రకటించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం పలు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ ఇప్పటి వరకు 51 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. 24 స్థానాలకు పేర్లను ప్రకటించాల్సి ఉంది. అయితే, కీలకమైన రాయ్బరేలీ పార్లమెంట్ స్థానం నుంచి నుపూర్ శర్మను బరిలోకి దింపాలని బీజేపీ నిర్ణయించింది. దీనిపై బీజేపీ నేతలను వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు.
వాస్తవానికి రాయ్బరేలీ లోక్సభ స్థానం గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్నది. ఫిరోజ్ గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు వరుసగా గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లోనూ సోనియా గాంధీ ఇక్కడ విజయం సాధించారు. అయితే, ఆరోగ్య కారణాల నేపథ్యంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. దాంతో ఆమెను కాంగ్రెస్ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపింది. ప్రస్తుతం రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నెలబెడుతుందనే ఊహాగానాలున్నాయి. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రాను పోటీ చేయించాలని యూపీ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడంతో యూపీలో కాంగ్రెస్ బలపడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
అయితే ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తే బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. కీలక నేత అయిన ప్రియాంక గాంధీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో నుపూర్ శర్మ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. నుపూర్ శర్మను రాయ్బరేలీ నుంచి బరిలోకి దింపితే.. ప్రియాంక గట్టి పోటీ ఇస్తుందని ఆ పార్టీ భావిస్తున్నది. అలాగే, బీజేపీలో మరికొన్ని పేర్లు సైతం వినిపిస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే మనోజ్ పాండే ఇటీవల ఆ పార్టీపై తిరుగుబాటు చేశారు. ఆయనను పార్టీలో చేర్చుకొని.. అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే దినేష్ ప్రతాప్ సింగ్ పేరును సైతం బీజేపీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా.. నుపూర్ శర్మ గతేడాది ఓ టీవీ చానల్ డిబేట్లో మహహ్మద్ ప్రవక్తపై అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన విసయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు యావత్ దేశంతో పాటూ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు సర్దుకోవడంతో ఆమెపై ఉన్న బహిష్కరణ నిర్ణయాన్ని ఎత్తివేసి.. ఆమెను రాయ్బరేలీ నుంచి బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నది.