న్యూఢిల్లీ, డిసెంబర్ 18: బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం కోరలు చాస్తున్నది. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు మోదీ సర్కార్ చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) అంచనాల ప్రకారం.. నిరుద్యోగుల సంఖ్య దాదాపు 2020లో కరోనా సమయానికి దాదాపుగా దగ్గరగా చేరడం ఆందోళన కలిగిస్తున్నది. 2022 నవంబర్ నాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య మళ్లీ 5 కోట్ల మార్క్ దాటి 5.1 కోట్లకు చేరిందని సీఎంఐఈ తాజా గణాంకాలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా నిర్వహించిన సర్వేల ఆధారంగా తాజా అంచనాలు రూపొందించారు. దేశంలో ప్రస్తుత కార్మిక శక్తి (లేబర్ ఫోర్స్) కరోనా ముందు నాటి పరిస్థితుల కంటే ఇంకా తక్కువగానే ఉన్నది. సీఎంఐఈ గణాంకాల ప్రకారం.. 2019లో శ్రామిక శక్తి 44.2 కోట్లు ఉండగా, 2022 నవంబర్ నాటికి ఇంకా తక్కువగా 43.7 కోట్లుగా ఉన్నది.
మూడేండ్లుగా పెద్దగా లేని మార్పు
దేశంలో నిరుద్యోగిత రేటు స్థిరంగా అధిక స్థాయిలోనే కొనసాగుతూ వస్తున్నది. 2019లో సగటున 7.4 శాతం ఉండగా, 2020లో 10 శాతానికి (కరోనా మొదటి లాక్డౌన్ సమయంలో 25%)పైగా పెరిగింది. ఆ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు కొద్దిగా ప్రారంభం కావడంతో 7.8 శాతానికి తగ్గిన నిరుద్యోగిత రేటు.. ఈ ఏడాది నవంబర్ నాటికి పెద్దగా మార్పు లేకుండా అదేస్థాయిలో ఉన్నది. ఏదేమైనప్పటికీ పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎంఐఈ డాటా ప్రకారం.. డిసెంబర్ 1న 8.2 శాతంగా ఉన్న నిరుద్యోగం.. డిసెంబర్ 16వ తేదీ నాటికి 9.3 శాతానికి చేరింది.
ఊగిసిలాటలోనే ‘ఉపాధి’ సంఖ్య
మూడేండ్లుగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 40 కోట్లకు అటుఇటుగా ఊగిసలాటలోనే కొనసాగుతున్నది. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి ఉపాధి పొందుతున్న వారి సంఖ్య దాదాపుగా 40.18 కోట్లుగా ఉంటే, 2019 నవంబర్లో 40.3 కోట్లుగా ఉన్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. గద్దెనెక్కిన తర్వాత ఈ హామీని అమలు చేయకుండా చెత్తబుట్టలో పడేశారు.