Jammu Kashmir | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం( Terrorism ) ముగియలేదు కానీ.. ఉగ్రవాదుల సంఖ్య మాత్రం తగ్గుతుందని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్( DGP Dilbag Singh ) వెల్లడించారు. నార్త్ కశ్మీర్లోని బందీపోరా జిల్లాలో డీజీపీ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం ముగిసిందని చెప్పలేం అని పేర్కొన్నారు. స్థానికులు కావొచ్చు లేదా పాకిస్తానీ ఉగ్రవాదులు కావొచ్చు.. కానీ చాలా వరకు ఉగ్రవాదుల( Terrorists ) సంఖ్య తగ్గిందని తెలిపారు. ఉగ్రవాదం వైపు అడుగులేసిన యువత మళ్లీ ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని పేర్కొన్నారు. అది తమ జీవితం కాదని యువత తెలుసుకున్నారని చెప్పారు. జమ్మూకశ్మీర్ యువత ఇప్పుడు ఆటల్లో, విద్యతో పాటు ఇతర రంగాల్లో నైపుణ్యం సంపాదించి, ప్రయోజకులుగా తయారవుతున్నారని డీజీపీ స్పష్టం చేశారు. తమ జీవితాలతో పాటు కుటుంబాల కోసం ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారని తెలిపారు. టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్న పోలీసులు, భద్రతా బలగాలను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు చివరి వరకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
పాకిస్తాన్( Pakistan )కు చెందిన ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఏకే47 రైఫిల్స్, పిస్తోల్స్, గ్రెనేడ్స్, ఐఈడీలను మన సరిహద్దుల్లోకి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ చర్యలను అరికడుతున్నామని, డ్రోన్లను కూల్చివేస్తున్నామని డీజీపీ తెలిపారు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో ఆయుధాలను సీజ్ చేశామన్నారు. క్వింటాళ్ల కొద్ది డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పోలీసులు, సెక్యూరిటీ ఫోర్సెస్ పటిష్టమైన నిఘాలో ఉన్నట్లు డీజీపీ పేర్కొన్నారు. డ్రోన్ కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయన్నారు. స్మగ్లింగ్ను చాలా వరకు అరికట్టామని డీజీపీ స్పష్టం చేశారు.