న్యూఢిల్లీ, డిసెంబర్ 23: దేశంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 752 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల నలుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3,420 యాక్టివ్ కేసులుండగా, కేరళలో ఈ తరహా కేసుల సంఖ్య 2 వేలు దాటింది. కొత్త కేసులు న్యూఢిల్లీ, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు, తెలంగాణలో నమోదయ్యాయి. క్రిస్మస్ పండగ తరుణంలో దేశంలో జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నది.
గత నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త కేసులు 52 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. నెల రోజుల్లో 8,50,000 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. 1,18,000 మంది కొవిడ్ వల్ల దవాఖానలో చేరారని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు జేఎన్.1 రకం వల్ల కలిగే ప్రాణాపాయాన్ని, తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తున్నదని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. కొవిడ్తో పాటు ఫ్లూ, పిల్లల్లో వచ్చే సాధారణ నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని ప్రకటించింది. మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, లక్షణాలు కనిపించినప్పుడు టెస్ట్ చేయించుకోవాలని ప్రజలకు సూచించింది.