India Alliance | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నప్పటికీ సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పరిస్థితి గందరగోళంగా కనిపిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్తో సీట్ల పంపకంపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందన్న వార్తలకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తెరదించింది. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ స్పష్టం చేశారు.
మరోవైపు ఢిల్లీతోపాటు గుజరాత్, హర్యానా, గోవా పోటీకి సంబంధించి కాంగ్రెస్, ఆప్ మధ్య ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో ఆప్ 4, కాంగ్రెస్ 3 చోట్ల పోటీ చేయనున్నాయని ప్రకటించారు. గుజరాత్లోని 26 సీట్లకుగానూ రెండు స్థానాల్లో మాత్రమే ఆప్ బరిలో నిలవనుండగా.. మిగతా 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీచేస్తుంది. హర్యానాలోని 10 సీట్లలో కాంగ్రెస్-9, ఆప్-1 చొప్పున పంచుకొన్నాయి. ఇక గోవాలోని రెండు ఎంపీ స్థానాలు, చండీగఢ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పోటీచేసేలా రెండు పార్టీలు ఒప్పందం చేసుకొన్నాయి. అయితే ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్లో మాత్రం కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా బరిలో నిలవనున్నాయి.