న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న తొందర తనకేమీ లేదని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రకటించారు. వచ్చే ఏడాది సీఎంగా బాధ్యతలు చేపడతాడని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపడేశారు. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సొంత పార్టీ నాయకులకు సూచించారు. ఆర్జేడీ బీహార్ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ఢిల్లీలో మాట్లాడుతూ పార్టీ యువనేత వచ్చే ఏడాది ముఖ్యమంత్రి పదవిని చేపడతారని వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికల్లో నితీశ్ జాతీయ రాజకీయాల్లో వెళ్తారని, దీంతో సీఎంగా తేజస్వీ అవుతారని చెప్పారు. అయితే ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడే ఈ ప్రకటన చేయడంతో అధికార భాగస్వామి అయిన జేడీయూ నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యున్నత పదవి అయిన సీఎం పీఠాన్ని అధిరోహించాలని తనకేమీ తొందర లేదని తేజస్వీ అన్నారు. తన మద్దతుదారులు అలా అన్నారని, కానీ తదుపరి సీఎం ఎవరనే విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రస్తుతం లేదన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఫాసిస్ట్ శక్తులను దేశం నుంచి తరమికొట్టడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తాము ఆ పనిని విజయవంతంగా పూర్తిచేశామని, ఇప్పుడు దేశవ్యాప్తంగా చేయాల్సి ఉందన్నారు. బీహార్లోని మహాఘట్బంధన్ కూటమి నేతగా సీఎం నితీశ్ ఉన్నారని స్పష్టం చేశారు. ఆయన కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని వెల్లడించారు.