న్యూఢిల్లీ, జనవరి 11 : ‘వేలాది సూసైడ్ బాంబర్లు దాడి చేయడానికి మా వద్ద సిద్ధంగా ఉన్నారు’ అంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరోసారి భారత్కు హెచ్చరికలు చేశాడు. మసూద్ అజార్ మాట్లాడిన ఒక ఆడియోను ఆ సంస్థ విడుదల చేసింది. అయితే ఈ ఆడియో సందేశాన్ని ఏ రోజున విడుదల చేసింది నిర్ధారణ కాలేదు. ఈ సందేశంలో తన కేడర్ బలం గురించి మసూద్ చాలా గొప్పగా, అతిశయోక్తిగా చెప్పడం వినిపించింది.
‘మా దగ్గర ఒకరు, ఇద్దరు, వందలు కాదు. వేయి కూడా కాదు.. వాస్తవ సంఖ్యను వెల్లడిస్తే ప్రపంచ మీడియాలో కలకలం సృష్టిస్తుంది’ అని పేర్కొన్నాడు. తమ సంస్థలో జరిపే నియామకాలు భౌతిక లాభాలు, వీసాలు, వ్యక్తిగత ప్రయోజనాలు కోరుకోవని, బలిదానం మాత్రమే కోరుకుంటాయని ఆయన అన్నాడు. కాగా పహల్గాం ఉగ్ర దాడి తర్వాత గత ఏడాది ఏప్రిల్ 22న పాకిస్థాన్లోని బహావల్పూర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో 26 మంది మృతి చెందగా, అందులో 10 మంది అజర్ బంధువులు కూడా ఉన్నారు.