Northeast monsoon | ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ను పలకరించాయి. నైరుతి రుతుపవనాలు దేశాన్ని వీడగా.. ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా తమిళనాడులో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఈశాన్య రుతుపవనాల వర్షాలు దేశంలోని ఆగ్నేయ ప్రాంతాల్లో ప్రారంభమవుతాయని పేర్కొంది. బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్పం మీదుగా ఈశాన్య గాలులు, రుతుపవనాల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు మొదలైనట్లు చెప్పింది. ఈ నెల 29 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు తమిళనాడు వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమవారం, మంగళవారాల్లో తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేట జిల్లాల్లో చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కారైకల్, పుదుచ్చేరిలో విస్తృతంగా మోస్తరు వర్షాలు, ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, మహేలో ఆదివారం, మంగళవారం మధ్య ఇదే వాతావరణం ఉంటుందని చెప్పింది. అయితే, సీజన్లో తమిళనాడులో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల కాలంలో సాధారణ వర్షాపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.