Water Crisis | కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం (Bengaluru)లో తీవ్ర నీటి సంక్షోభం (Water Crisis ) నెలకొన్న విషయం తెలిసిందే. గత ఏడాది సరిపడినంత వర్షపాతం నమోదవకపోవడంతో బెంగళూర్లో ఎన్నడూ లేని విధంగా నీటి సంక్షోభం తలెత్తింది. దీంతో అవసరాలకు సరిపడా నీరు లేక నగర వాసులు గత నెలరోజులకు పైగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. 60 శాతం మంది పైగా నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి కోసం జనం ట్యాంకుల వద్ద బారులు తీరుతున్న దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నీటి సంక్షోభంపై కర్ణాటక డిప్యూటీ సీఎం (Karnataka Deputy Chief Minister) డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో నీటి కొరతే లేదంటూ వ్యాఖ్యానించారు.
నగరంలో ఉన్న నీటి వనరులను గుర్తించామని.. ప్రజలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా సరైన సమయానికి అందరికీ నీళ్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘బెంగళూరులో నీటి సంక్షోభం అనేదే లేదు. సిటీలో 7 వేల బోర్వెల్స్ ఎండిపోయాయి. అయినా ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంది. నీటి వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాం. ఎవరికీ సమస్య రాకుండా ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీళ్లు సరఫరా చేస్తాం. అందరికీ నీళ్లు సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
అయితే, నగరం తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటుంటే.. డీకే శివకుమార్ ఇలా చెప్పడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలు తాగడానికి నీరు లేక అల్లాడుతుంటే.. డిప్యూటీ సీఎం మాత్రం నగరంలో నీటి సంక్షోభమే లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ ధ్వజమెత్తుతున్నారు.
బెంగళూరు ప్రజల నీటి కష్టాలు..
కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగానే బోర్లు ఎండిపోవడంతో బెంగళూరు నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడిందంటే నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. అటు నగర జలమండలి కూడా సరిపడా నీటిని సరఫరా చేయడం లేదు. దీంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి. దీంతో డిమాండ్ ఎక్కువవడంతో ట్యాంకర్ల ధరలు అమాంతం పెంచేశారు.
నగరంలో రోజుకు 2,600-2,800 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉంటే ఇప్పుడు దాదాపుగా 1,300 ఎంఎల్డీ నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే, అవసరమైన నీటిలో సగం కూడా సరఫరా జరగడం లేదు. మరోవైపు ఎండాకాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోవు రోజుల్లో పరిస్థితి ఇంకా ఎంత స్థాయికి దిగజారుతుందోనని నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి నీటి బొట్టును వృథాగా పోకుండా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఎండాకాలం అయినప్పటికీ నెలకు ఐదు సార్లు మాత్రమే స్నానాలు చేస్తున్నామని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వంట వండటం, గిన్నెలు తోమడం వంటి వాటికి నీరు ఎక్కువగా అవసరం ఉండటంతో.. ఫుడ్ను బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు.
Also Read..
Water Crisis | నెలకు ఐదు సార్లే స్నానం.. వంట వండుకోకుండా ఫుడ్ ఆర్డర్.. బెంగళూరు ప్రజల నీటి కష్టాలు
Leopard | బంధించే క్రమంలో దాడి చేసిన చిరుత.. అటవీ అధికారి సహా మరో వ్యక్తికి గాయాలు