న్యూఢిల్లీ, ఆగస్టు 2: రూపాయి విలువ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పతనం అయినప్పటికీ, కేంద్రప్రభుత్వం అసత్యపు ప్రవచనాలను వల్లె వేస్తున్నది. రూపాయి విలువ పతనం కాలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా పేర్కొన్నారు. రూపాయి సహజ రీతిలోనే ముందుకు సాగుతున్నదని, దాని కదలికలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిరంతరం దృష్టి సారిస్తున్నదని చెప్పుకొచ్చారు. అవసరమైనప్పుడు కేవలం ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇతర దేశాల తరహాలో ప్రభుత్వం గానీ, ఆర్బీఐ గానీ రూపాయి విలువ విషయంలో జోక్యం చేసుకోవడంలేదని నిర్మల ఈ సందర్భంగా తెలిపారు. దీర్ఘకాలంలో రూపాయి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం, ఆర్బీఐ దృష్టి సారిస్తున్నదని వెల్లడించారు. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగానే ఉన్నదని తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయాల ప్రభావాన్ని ఇతర కరెన్సీల కంటే రూపాయే బలంగా ఎదుర్కోగలిగిందన్నారు. విదేశీ మారక నిల్వలపై ఆందోళనలు వద్దన్న నిర్మల.. జూలై 22 నాటికి 571.56 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయన్నారు. ఇతర దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పోల్చుతూ.. ఆర్బీఐ, కేంద్రం చేసిన ప్రయత్నాల వల్లే భారత్లో ద్రవ్యోల్బణం రేటు 7 శాతంగా ఉందన్నారు.
నగదు ఉపసంహరణపై నో జీఎస్టీ
తాజా జీఎస్టీ నిర్ణయాలపై మాట్లాడుతూ.. పేదలు వినియోగించే ఏ వస్తువుపైనా పన్ను విధించలేదని పేర్కొన్నారు. ముందుగా ప్యాక్ చేసి లేబుల్ వేసిన వస్తువులపైనే 5 శాతం జీఎస్టీ విధిస్తున్నాం తప్ప విడిగా విక్రయిస్తే పన్ను ఉండబోదన్నారు. లేబుల్ వేసిన అన్ని ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధింపునకు జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ర్టాలూ అంగీకరించాయని తెలిపారు. ప్రతీ రాష్ట్రం తృణధాన్యాలు, పప్పులు, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి కొన్ని ఆహార పదార్థాలపై పన్ను విధించాయని పేర్కొంటూ ఆహార పదార్థాలపై కేంద్రం తాజాగా జీఎస్టీ విధించడాన్ని సమర్థించుకున్నారు. శ్మశాన వాటికలపై జీఎస్టీ లేదని.. కొత్త శ్మశానవాటికల నిర్మాణంపై పన్ను ఉంటుందని స్పష్టం చేశారు. బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరిస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదని, ప్రింటర్ నుంచి బ్యాంకులు కొనుగోలు చేసే చెక్బుక్లపైనే జీఎస్టీ ఉంటుందన్నారు. వినియోగదారుల చెక్బుక్లపై పన్ను ఉండదన్నారు. దవాఖానల్లో పడకలు, ఐసీయూలపై జీఎస్టీ ఉండదని, రోజుకు రూ. 5 వేల కంటే ఎక్కువ అద్దె ఉన్న గదులకే పన్ను ఉంటుందన్నారు.
నిర్మలమ్మ సూక్తులు
అంబానీ-అదానీలకు అనుకూలంగా మా ప్రభుత్వం పనిచేస్తున్నదనడంలో అర్థం లేదు.
రూపాయి భేష్.. డాలర్తో పోల్చితే పతనం సహజమే.. దేశ కరెన్సీకి ఇప్పుడొచ్చిన ఇబ్బందేమీ లేదు.
దేశంలోకి విదేశీ పెట్టుబడుల సంగతి రిజర్వ్ బ్యాంక్ చూసుకుంటుంది.
భారత్కు మాంద్యం ముప్పు లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నది.
అధిక ద్రవ్యోల్బణం, తీవ్ర నిరుద్యోగం వంటివి దేశంలో ఉండనే ఉండవు.
అమెరికా, మరెన్నో దేశాల కంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగున్నదిప్పుడు.
ఏకాభిప్రాయంతోనే జీఎస్టీ రేట్ల పెంపు. రాష్ర్టాల ఆమోదం లేనిదే ఏదీ జరగదు.
దేశంలో డాలర్లు పుష్కలం. ఫారెక్స్ నిల్వలు సరిపడా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం దిగొస్తున్నది. భారత్లోనూ తర్వలోనే శాంతిస్తుంది.
ఆహారం, ఇంధన ఉత్పత్తులపైనే ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా ఉన్నది.
కరోనా, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలోనూ దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం దిగువనే ఉంటున్నది.