G20 Summit | భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నెల 9, 10వ తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జీ20 సమ్మిట్ జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సహా పలు దేశాల నేతలు స్వయంగా హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఢిల్లీ (Delhi) లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాలతో రాజధాని ప్రాంతంలో డేగ కన్ను వేశారు. డాగ్ స్క్వాడ్స్ను కూడా రంగంలోకి దింపారు.
సమ్మిట్ నేపథ్యంలో మూడు రోజుల పాటు రాజధాని నగరంలో పలు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నగరంలో క్లౌడ్ కిచెన్, డెలివరీ సేవలకు అనుమతిని నిరాకరించారు. స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) వంటి ఫుడ్ డెలివరీ సేవలను నిషేధించారు. ఈ కామర్స్ సంస్థలు అమెజాన్ (Amazon), ఫ్లిప్కార్ట్ (Flipkart) సంస్థల డెలివరీలను కూడా అనుమతించబోరు. ఎన్డీఎమ్సీ ప్రాంతంలో డెలివరీ సేవలను అనుమతించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పస్టం చేశారు. ఈ ఆంక్షలు ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అదేవిధంగా ఈనెల 7వ తేది అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు ట్రాఫిక్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్ యాదవ్ తెలిపారు.
మరోవైపు సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించారు. 9, 10వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయాలని ఆదేశించింది.
Also Read..
Biden: జో బైడెన్కు నెగటివ్.. జిల్కు కోవిడ్ పాజిటివ్
Heavy Rain fall | హైదరాబాద్లో కుండపోత వాన.. మియాపూర్లో అత్యధికంగా 14 సెంటీమీటర్లు