కొహిమా: అత్యధిక రాజకీయ పార్టీలు కలిగిన నాగాలాండ్లో (Nagaland) అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్డీపీపీ-బీజేపీ (NDPP-BJP) కూటమికే అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో మరోసారి ప్రతిపక్షమే (Opposition) లేని ప్రభుత్వం ఏర్పడనుంది. 60మంది సభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. మార్చి 2న ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఎన్నికల ముందే జట్టుకట్టిన అధికార ఎన్డీపీపీ 25, బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో 37 మంది ఎమ్మెల్యేలతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుకునే బంలం సంపాదించాయి. ఇక 7 స్థానాలు గెలిచిన ఎన్సీపీ (NCP) రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదేవిధంగా ఎన్పీపీ 5, ఎల్జేపీ 2, ఎన్పీఎఫ్, ఆర్పీఐ 2 చొప్పున, జేడీయూ 1, నలుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు.
అయితే ఎల్జేపీ, ఆర్పీఐ, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార కూటమికి తమ మద్దతు ప్రకటించారు. తాజాగా ఎన్సీపీ, ఎన్పీఎఫ్ కూడా నిపియు రియో (Neiphiu Rio) నేతృత్వంలోని ఎన్డీపీపీతో (NDPP) చేతులు కలిపాయి. దీంతో రాష్ట్రంలోని అన్నిపార్టీలు అధికార కూటమిలో చేరడంతో అసెంబ్లీలో ప్రతిపక్షమే అనేది లేకుండాపోయింది. గతంలో కూడా ఇలానే జరిగింది. 2015, 2021లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అధికార పార్టీకి మద్దతు ప్రకటించాయి.
కాగా, ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన ఎన్డీపీపీ అధినేత నిఫియు రియో ఐదోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. దీంతో రాష్ట్రాన్ని సుదీర్ఘకాలంగా పాలించిన ముఖ్యమంత్రిగానూ రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు సీఎంగా కొనసాగిన నేతగా ఎస్సీ జమీర్ నిలిచారు.