లౌడ్ స్పీకర్ల విషయంలో మహారాష్ట్రలో ఎలాంటి రూల్స్నూ బ్రేక్ చేయడం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అలాగే హిందుత్వ విషయంలో తమకు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. శివసేనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అయినా.. సూడో హిందుత్వ వాదులకు ప్రజలు మద్దతు పలకరని రౌత్ ధీమా వ్యక్తం చేశారు.
ఎక్కడా లౌడ్స్పీకర్ల రూల్స్ను బ్రేక్ చేయడం లేదు. సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలనే అనుసరిస్తూ వస్తున్నాం. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం.. వారిని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. అంతటి సమర్థత వున్న ప్రభుత్వమే మాది అంటూ రౌత్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
అయితే.. లౌడ్ స్పీకర్లను నిషేధించాలన్న ఉద్యమం ఇంకా రాలేదని, అలాగే అన్ని మసీదులు ఈ లౌడ్ స్పీకర్ల విషయంలో అనుమతులు తీసుకున్నాయని రౌత్ వెల్లడించారు. తాము ఇప్పటికీ బాలా సాహెబ్ సూత్రాలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నామని, తమకు హిందుత్వ పాఠాలు నేర్పాల్సిన అవసరమే లేదని రౌత్ పేర్కొన్నారు.