World Happiness | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ పదేండ్ల పాలనలో దేశంలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. బుధవారం అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితికి (ఐరాస) అనుబంధంగా పనిచేస్తున్న వెల్బీయింగ్ రిసెర్చ్ సెంటర్ ‘వరల్డ్ హ్యాపీనెస్’ రిపోర్ట్ విడుదల చేసింది. 143 దేశాలకు ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 126వ స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ ఏడోసారి తొలి ర్యాంకు సాధించి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా రికార్డు సృష్టించింది. తాలిబన్ల పాలనలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్ జాబితాలో 143వ ర్యాంకుతో అట్టడుగున నిలిచింది.
వివిధ దేశాల్లో ప్రజల తలసరి జీడీపీ, సామాజికంగా వారికి లభిస్తున్న మద్దతు, జీవిత కాలం, స్వేచ్ఛ, అవినీతి రేటు, ఆత్మ సంతృప్తి తదితర అంశాల ఆధారంగా ‘వరల్డ్ హ్యాపీనెస్’ రిపోర్ట్ను ఏటా ఐరాస విడుదల చేస్తున్నది.
2014లో ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టినప్పుడు హ్యాపీనెస్ జాబితాలో ఇండియా ర్యాంకు 111గా ఉండేది. తాజా జాబితాలో భారత్ ర్యాంకు 126కు పడిపోయింది. అంటే గడిచిన పదేండ్లలో 15 ర్యాంకులను భారత్ కోల్పోయింది.
భారత్కు పొరుగున ఉన్న నేపాల్ (93), రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను తరుచూ ఎదుర్కొనే ఇరాక్ (92), ఇరాన్ (100), నైజీరియా (102), పాకిస్థాన్ (108), ఉగాండా (117) వంటి దేశాలు జాబితాలో ఇండియా కంటే మెరుగైన ర్యాంకును సాధించడం గమనార్హం.