న్యూఢిల్లీ, జూలై 22: తన పని తాను చేసుకుపోతానని, అందులో ఎటువంటి మార్పు ఉండదని ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్న్యూస్ సహవ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ శుక్రవారం స్పష్టం చేశారు. తన పని విషయంలో సుప్రీంకోర్టు కూడా ఎటువంటి నియంత్రణలు పెట్టలేదని పేర్కొన్నారు. మరోవైపు ట్వీట్లు చేసేందుకు తాను రూ.2 కోట్లు తీసుకున్నానన్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. దర్యాప్తు అధికారులు కూడా ఈ విషయాన్ని అడగలేదని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఈ ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. ట్వీట్ల ద్వారా మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీశారనే ఆరోపణలపై అరస్టైన జుబేర్ రెండు రోజుల క్రితం విడుదలయ్యారు. జర్నలిస్టును ట్వీట్ చేయకుండా ఆపలేమని పేర్కొంటూ సుప్రీంకోర్టు అన్ని కేసుల్లో జుబేర్కు అరెస్టు నుంచి విముక్తి కల్పించింది.