న్యూఢిల్లీ, డిసెంబర్ 26: విపక్ష ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చిచ్చు మొదలైంది. పీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా.. ఆ అవసరం లేదని ఎన్సీపీ తదితర పక్షాలు అంటున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇండియా కూటమి పీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేరును టీఎంసీ అధినేత్రి మమత, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఎన్సీపీ అధినేత శరద్పవార్ స్పందించారు. ఎన్నికలకు ముందు పీఎం అభ్యర్థిని ప్రకటించకపోతే ఏమీ కాదని అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లోనూ ముందుగా పీఎం అభ్యర్థిని ప్రకటించలేదని, ఎన్నికల తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. మార్పు రావాలని ప్రజలు కోరుకుంటే, దానికి అనుగుణంగా వారు నిర్ణయం తీసుకొంటారని చెప్పారు.
పలువురు సీనియర్లు కూటమి పీఎం అభ్యర్థిగా నిలిచేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఖర్గే పేరు ప్రతిపాదనపై బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వీరిద్దరూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నితీశ్ను పీఎం అభ్యర్థిగా పేర్కొంటూ బీహార్లో పలు చోట్ల పోస్టర్లు కూడా వెలిశాయి.
ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల సమయంలోనూ విభేదాలు బహిర్గతమయ్యాయి. కూటమిలో పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి. కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ, ఆప్ తదితర పార్టీలు పోటీగా అభ్యర్థులను బరిలోకి దింపాయి. సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ మిత్రద్రోహానికి పాల్పడిందని ఆరోపించిన అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ.. మధ్యప్రదేశ్లో సొంతంగా బరిలోకి దిగింది.