Toll Plaza | న్యూఢిల్లీ: దేశంలోని రహదారులపై అడ్డంకుల్లేని సరికొత్త టోల్ వ్యవస్థ (బ్యారియర్ లెస్ టోల్ సిస్టం)ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఇది కార్యరూపం దాల్చితే టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు 30 సెకండ్లు కూడా ఆగాల్సిన అవసరం ఉండదన్నారు.
ప్రస్తుతం ఈ నూతన వ్యవస్థపై ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేలో ట్రయల్స్ జరుగుతున్నాయని, ఉపగ్రహ ఆధారిత సాంకేతికతలు, కెమెరాల పనితీరును పరీక్షిస్తున్నారని తెలిపారు. ఈ పరీక్షలు విజయవంతమైతే నూతన టోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని బుధవారం ఆయన స్పష్టం చేశారు. వాహనదారులు కిలోమీటర్ల వారీగా టోల్ చార్జీలు చెల్లించే వ్యవస్థను కూడా ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఈ నూతన టోల్ వ్యవస్థతో ప్రయాణ సమయం తగ్గుతుందని పేర్కొన్నారు.