Arvind Kejriwal | న్యూఢిల్లీ, మార్చి 27: మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఆయన అరెస్టు వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను బుధవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరణకాంత శర్మ విచారించారు. తన అరెస్టు అక్రమమని, వెంటనే తనను విడుదల చేస్తూ మధ్యంతర ఉపశమనం కల్పించాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు. ఆధారాల కోసం తనను అరెస్టు చేయలేదని, కేవలం తనను, తన పార్టీని నిర్వీర్యం చేయడానికే అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల వేళ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. కాగా, కేజ్రీవాల్ పిటిషన్పై స్పందించేందుకు తమకు మూడు వారాల సమయం కావాలని ఈడీ తరఫున వాదించిన అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టును కోరారు. అయితే, కేవలం పిటిషన్పై విచారణను వాయిదా వేసేందుకు ఎక్కువ సమయం అడుగుతున్నారని సింఘ్వి అభ్యంతరం తెలిపారు. చివరకు ఏప్రిల్ 2 లోగా స్పందన తెలియజేయాల్సిందిగా ఈడీని కోర్టు ఆదేశిస్తూ ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. కాగా, కోర్టు ప్రాంగణంలో నిరసనలు తెలిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ హెచ్చరించారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా కోర్టుల్లో నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ లీగల్ సెల్ పిలుపునివ్వడంతోఆయన ఈ విధంగా స్పందించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా కోర్టుల్లో ఎలాంటి నిరసనలు తెలపవద్దని న్యాయవాదులకు సూచించింది.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయమై అమెరికా చేసిన ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి అమెరికా దౌత్యవేత్త, తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను పిలిపించి నిరసన తెలిపింది. దౌత్య సంబంధాల్లో ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని, తోటి ప్రజాస్వామ్య దేశాల పట్ల ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది.
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీలో ఆప్ నేత దీపక్ సింగ్లాకు చెందిన ప్రాంగణాల్లో ఈడీ బుధవారం సోదాలు చేపట్టింది. కొన్ని ఆర్థిక అక్రమాల ఆరోపణలకు సంబంధించి తనిఖీలు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, దీపక్ సింగ్లా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వాస్ నగర్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేశారు.