చండీగఢ్: ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేసే ఉద్దేశం లేదని హత్యకు గురైన కాంగ్రెస్ నేత, పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక వీడియోను సోషల్ మీడియాలో శనివారం పోస్ట్ చేశారు. పంజాబీలో మాట్లాడిన ఆయన తాను సిద్ధూ మూసేవాలా తండ్రినని, కొన్ని విషయాలు చెప్పదలచుకున్నానని అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. అందులో వస్తున్న వదంతులను నమ్మవద్దని చెప్పారు. తాను ఇటీవల కుమారుడ్ని కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ కష్ట కాలంలో మద్దతుగా నిలిచిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 8న ప్రార్థనా సమావేశం జరుగుతుందని చెప్పారు. అప్పుడు మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని అన్నారు. ప్రస్తుతం ఇంత కంటే ఎక్కువగా మాట్లాడే స్థితిలో తాను లేనన్నారు.
కాగా, పంజాబ్ ప్రభుత్వం భద్రత ఉపసంహరించిన మరునాడైన మే 29న మాన్సా జిల్లాలోని సొంత ఊరికి కారులో వెళ్తున్న సిద్ధూ మూసేవాలాపై దుండగులు కాల్పులు జరుపడంతో చనిపోయారు. తన కుమారుడి హత్యపై కేంద్ర ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సిద్ధూ కుటుంబం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో శనివారం చండీగఢ్కు వచ్చిన అమిత్ షాను ఆయన కుటుంబం కలిసింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కూడా శుక్రవారం సిద్ధూ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. హంతకులను త్వరలో అరెస్ట్ చేస్తామని భరోసా ఇచ్చారు.
#WATCH | Punjabi singer Sidhu Moose Wala’s family met Union Home Minister Amit Shah in Chandigarh.
He was killed by unknown assailants in Mansa district on 29th May. pic.twitter.com/aSQqjWcEIs
— ANI (@ANI) June 4, 2022