న్యూఢిల్లీ, ఆగస్టు 26: పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసినట్టు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ శనివారం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలు సెక్యూరిటీ చట్టాన్ని ఉల్లంఘించాయా లేదా అనే అంశాలను పరిశీలించాలంటూ వచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తి చేసిన సెబీ దాని నివేదికను సుప్రీంకు అందజేసింది.
అదానీ గ్రూప్ అక్రమాల ఆరోపణలపై ఏం నిర్ధారించిందన్న అంశాన్ని వెల్లడించని సెబీ తాము చేసిన దర్యాప్తు అంశాల ఆధారంగా తగిన చర్యలు ఉంటాయని మాత్రం తెలిపింది. అదానీ గ్రూప్కు చెందిన లిస్టింగ్ కంపెనీల్లోని మొత్తం 24 లావాదేవీలపై దర్యాప్తు జరిపామని, అందులో 22 పూర్తిగా దర్యాప్తు చేశామని పేర్కొంది. అదానీ గ్రూప్లో పబ్లిక్ షేర్ హోల్డర్లయిన 12 మంది విదేశీ ఇన్వెస్టర్లతో జరిపిన ఆఫ్షోర్ లావాదేవీలపై కూడా దర్యాప్తు చేసినట్టు పేర్కొంది. కాగా, అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఆరోపణల కేసు విచారణ ఈ నెల 29న సుప్రీంలో జరుగుతుంది.