న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు దాటినా అమేథిలో ఒక జిల్లా కేంద్ర దవాఖాన కూడా ఏర్పాటు చేయలేదని మంగళవారం ఎద్దేవా చేశారు. ఆత్మ నిర్బర్ పథకం కింద రూ.6 లక్షల కోట్ల నిధుల సేకరణకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ను రాహుల్ గాంధీ తప్పుబట్టారు.
2019 లోక్సభ ఎన్నికల్లో అమేథీ, కేరళలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అమేథిలో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓడించారు.
అమేథీలో 70 ఏండ్లలో ఒక్క జిల్లా కేంద్ర దవాఖాన ఏర్పాటు చేయని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.6 లక్షల కోట్ల నిధులు సేకరించడం సమస్యగా ఉందని ఇరానీ వ్యాఖ్యానించారు. నేషనల్ మానిటైజేషన్ పాలసీ కింద 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, స్టేడియంలు, నౌకాశ్రయాలు, పవర్, గ్యాస్ తదితర రంగాల సంస్థల్లో వాటాలను ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది.