న్యూఢిల్లీ : పన్నెండో తరగతి మార్కుల ప్రకటనకు సంబంధించి సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ సమర్పించిన మూల్యాంకన ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు గురువారం ఆమోదముద్ర వేసింది.కరోనా నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఆయా బోర్డులు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. జులై 31లోపున 12వ తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటిస్తామని సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ కోర్టుకు తెలిపాయి. విద్యార్థుల 10, 11వ తరగతుల తుది ఫలితాలు, 12వ తరగతి ప్రీఫైనల్ మార్కుల ఆధారంగా.. 30-30-40 ఫార్ములాతో 12వ తరగతి తుది మార్కులను కేటాయించనున్నట్టు సీబీఎస్ఈ కోర్టుకు వివరించింది. విద్యార్థి చివరి ఆరు తరగతుల్లో సాధించిన మార్కుల ఆధారంగా.. 12వ తరగతి తుది మార్కులను కేటాయిస్తామని సీఐఎస్సీఈ వెల్లడించింది. తుది మార్కులపట్ల సంతృప్తిగా లేని విద్యార్థులు పరీక్షలను రాయాలనుకుంటే, రాయొచ్చని ధర్మాసనం పేర్కొంది. దీనిపై తర్వాత విచారణ చేపడుతామన్నది. మూల్యాంకన విధానంలో లేదా తుది మార్కులపై విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వివాదాల పరిష్కారానికి సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ, సీఐఎస్సీఈలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మార్కులను ఎలా లెక్కిస్తారు?
విద్యార్థులకు 12వ తరగతి తుది మార్కులను కేటాయించేందుకు సీబీఎస్ఈ చివరి మూడు తరగతుల (10, 11, 12) మార్కులను (30-30-40 ఫార్ములా ప్రకారం) పరిగణలోకి తీసుకోనున్నది. 10వ తరగతి ఫైనల్ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా 30 శాతం మార్కులు కేటాయిస్తారు. 10వ తరగతిలోని ఐదు పేపర్ల నుంచి మెరుగైన మార్కులు సాధించిన మూడు పేపర్లను పరిగణలోకి తీసుకుంటారు. ఇక, 11వ తరగతి ఫైనల్ పరీక్షల ఆధారంగా 30 శాతం మార్కులు కేటాయిస్తారు. ఇందులో కూడా మెరుగైన మార్కులున్న మూడు పేపర్లను పరిగణలోకి తీసుకుంటారు. 12వ తరగతి ప్రీ బోర్డు పరీక్షల ఆధారంగా 40 శాతం మార్కులు కేటాయిస్తారు. 12వ తరగతిలో యూనిట్ టెస్టులు, ప్రాక్టికల్, అంతర్గత మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు కూడా తుది మార్కుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికే ఈ మార్కులను ఆయా పాఠశాలలు సీబీఎస్ఈ పోర్టల్లో అప్లోడ్ చేశాయి. మరోవైపు, విద్యార్థి చివరి ఆరు తరగతుల్లో (12, 11, 10, 9, 8, 7 తరగతులు) సాధించిన మార్కుల ఆధారంగా.. సీఐఎస్సీఈ 12వ తరగతి తుది మార్కులను కేటాయించనున్నది. తుది మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చు.
మార్కులను లెక్కించేదెవరు?
మూల్యాంకనానికి ప్రతి స్కూల్ విధిగా ‘ఫలితాల కమిటీ’ని ఏర్పాటుచేయాలి. ఈ కమిటీనే మార్కుల లెక్కింపు, వెబ్సైట్లో అప్లోడ్, ఫలితాలపై విద్యార్థులు లేవనెత్తే అభ్యంతరాలను పర్యవేక్షిస్తుంది. జులై 15 లోపు తుది మార్కులను కమిటీ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులుంటారు. స్కూల్ ప్రిన్సిపాల్, స్కూల్కు చెందిన ఇద్దరు సీనియర్ టీచర్లు,సమీపంలోని సీనియర్ సెకండరీ స్కూల్కు చెందిన ఇద్దరు సీనియర్ టీచర్లు ఉంటారు.
కింది తరగతుల మార్కులు ఎందుకు?
కొవిడ్-19 కారణంగా 12వ తరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్, ప్రాక్టికల్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించారు.ఈ మార్కులనే 12వ తరగతి తుది మార్కుల కేటాయింపునకు ప్రామాణికంగా తీసుకుంటే ప్రతిభ ఉన్న విద్యార్థులు నష్టపోయే ప్రమాదమున్నది. అందుకే 12వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలకు 40 శాతం వేయిటేజీ, 10వ తరగతి మార్కులకు 30 శాతం, 11వ తరగతి మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇచ్చారు.
విద్యార్థులు ఫెయిలైతే?
తుది ఫలితాల్లో ఎవరైనా విద్యార్థులు ఫెయిలైతే వారికి రాతపరీక్ష నిర్వహిస్తారు. ఫెయిల్ అయిన విద్యార్థులను ‘ఎస్సెన్షియల్ రిపీట్ (తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలి)’ లేదా ‘కంపార్ట్మెంట్’ క్యాటగిరీలో చేర్చుతారు. మూల్యాంకన విధానంతో ఇచ్చిన తుది మార్కులతో సంతృప్తిగా లేని విద్యార్థులు కూడా రాతపరీక్షలు రాయొచ్చు. ప్రైవేటుగా పరీక్ష రాసే విద్యార్థులకు రాతపరీక్షలను నిర్వహిస్తారు. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.
స్కూళ్లలో విద్యార్థుల గత మార్కులు లేకపోతే?
12వ తరగతిలో ఒక విద్యార్థి కొత్త స్కూల్లో చేరాడని అనుకుంటే, ఆ విద్యార్థి 11వ తరగతి, 10వ తరగతి మార్కుల వివరాలు ఆ స్కూల్ డేటాబేస్లో ఉండవు. అయితే, స్కూల్ యాజమాన్యం బోర్డును సంప్రదిస్తే ఆ వివరాల్ని ఇస్తారు.
కావాలని ఎక్కువ మార్కులు కేటాయిస్తే?
తమ విద్యార్థులకు మెరుగైన మార్కులు రావాలన్న ఉద్దేశంతో కొన్ని స్కూళ్లు స్టూడెంట్లకు ఎక్కువ మార్కులు కేటాయించే అవకాశమున్నది. ఇలా జరుగకుండా ఉండేందుకు సీబీఎస్ఈ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. మెరుగైన మూడు సబ్జెక్టుల్లో విద్యార్థి సాధించిన సగటు మార్కులకు +/- 5 మార్కులకు మించి ఇవ్వకూడదు. ఉదాహరణకు 11వ తరగతిలో ఒక విద్యార్థి సాధించిన మూడు సబ్జెక్టుల సగటు మార్కులు 80 అనుకుంటే, స్కూల్ యాజమాన్యం ఇచ్చే మార్కులు 75-85 మార్కుల పరిధిని దాటిపోవద్దు.