Delhi riots case : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసు (Riots case) లో నిందితులుగా ఉన్న షర్జీల్ ఇమామ్ (Sharjeel Imam), ఉమర్ ఖలీద్ (Umar Khalid) సహా ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నిరాకరించింది. ఈ కేసులో ఇమామ్, ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్లు 2022 నుంచి పెండింగ్లో ఉండగా.. తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది.
నిందితులు ఉద్దేశపూర్వకంగానే కుట్రచేసి అల్లర్లకు పాల్పడ్డారని, దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు నిర్దోషులుగా తేలేవరకు జైల్లో ఉండటమే సరైనదని సొలిసిటర్ జరనల్ తుషార్ మెహతా వాదించారు. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో దాదాపు 53 మంది దుర్మరణం పాలయ్యారు. మొత్తం 700 మందికిపైగా గాయపడ్డారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతడి హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత తాహిర్ హుస్సేన్ను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద ఛార్జిషీట్ నమోదు చేశారు.