న్యూఢిల్లీ : పంజాబ్లో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండనే ఉండదు అని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ తేల్చిచెప్పారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో మీరు కూడా బీజేపీతో తెగదెంపుల నిర్ణయాన్ని వాపస్ తీసుకుంటారా? అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు బాదల్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమంలో 700 మంది రైతులను కోల్పోయాం. రైతుల చావుకు కారణమైన బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ జతకట్టే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. బీజేపీతో ఉన్న అనుబంధాల్ని గతేడాదే తెంచేసుకున్నామని తెలిపారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తమ పార్టీకి చెందిన ఎంపీ హర్సిమ్రాత్ కౌర్ బాదల్.. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారని గుర్తు చేశారు.